స్వయందత్త
తాను వరించినవాడికి తన్ను తాను సమర్పించుకుంటూ (పెద్దల అనుమతి లేక పోయినా ) అతడిలోనే జీవితాన్ని, పంచుకోదల్చిన కన్యను స్వయందత్త అంటారు. ఈ రకం పెళ్లిళ్ళను పూర్వం గాంధర్వం అనేవారు. ఎనిమిది రకాల పెళ్ళిళ్ళను ఆనాడు శాస్త్రం సమ్మతించేది ఇవి బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, రాక్షసం, ఆసురం, గాంధర్వం, పైవాచం అనేవి. పేర్లనుబట్టే వీటి లక్షణాలను, ఉత్తమ నీచత్వాలను అర్థం చేసుకోవచ్చు.
పోగా గాంధర్వ వివాహానికి రాక్షసంకన్నా ఆసురం కన్నా తరువాతి స్థానాన్నే ఇచ్చారనేది గమనార్హం. కేవలం పైశాచం కన్నా ఒక్కమెట్టుగా గాంధర్వానికి ఎక్కువ. ఈ వివాహాలను గురించి అనేక ఇతివృత్తాలు మన పురాణేతిహాసాలలో ఋషులచేత పొందుపరబడ్డాయి. శకుంతల దుష్యంతుణ్ణి గాంధర్వ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంది.
యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్ల తనకు నచ్చినవాడ్ని పెళ్ళాడితే వచ్చే పరిణామాలు ఎలావుంటాయో ఆలోచించాలంటే శకుంతలా దుష్యంతుల దగ్గరకు మనమోసారి వెళ్ళాలి .
ఈ కథ అందరికీ తెలిసిందే. కానీ నన్నయ సృష్టించిన శకుంతలకీ కాళిదాసు సృష్టించిన శకుంతలకీ భేదం వుంది. కాళిదాసు శకుంతల మరీ సుకుమారమైన విజాజి పువులా గంధించి పరమ రమణీయ మూర్తిలా సౌందర్యరాశిలా కనుపడుతుంది. నన్నయ శకుంతలలో జీవన సంద్రంలో సంభవించే తుఫాలనుకు ఉప్పెనలకూ ఎదురు నిల్చి స్థిరంగా నిలబడగలిగే సుస్థిర చిత్తయైన స్త్రీమూర్తిని చూడగల్గుతాం. ఆమె బొండు మల్లియలా అరుదైన స్త్రీ కుసుమం. ప్రస్తుత కాలంలో యవతులకు నన్నయ శకుంతల ఏం సందేశం ఇస్తుందో పరిశీలిద్దాం.
శకుంతలను చూచిన ప్రధమ క్షణంలోనే దుష్యంతుడు ఆకర్షింపబడ్డాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. కానీ భయపడతాడు, ఆమె కణ్వమహర్షి కూఉరేమోనని. ఋషి కుమార్తెన రాజులు ఆశించరాదలనే నియమంకన్న ముని ఎక్కడ శపిస్తాడోనన్న భయమే ఆ రాజుకు ఎక్కువగా ఉంటుంది. శకుంతల తన జన్మ వృత్తాంతము చెప్తుంది. విశ్వామిత్రుడూ మేనకా తన జన్మకారకులైప్పటికీ వనాలలో వదలివేసి వెళ్ళిపోగా పక్షులు కాపాడుతుంటె చూచి దయతో తనను ఆశ్రమానికి తీసుకువచ్చి కణ్వముని పెంచాడని చెప్తుంది. శకుంతల రతీదేవిలా సర్వాంగశోభతో విరాజిల్లుతూ దుష్యంతుని మన్మధ బాధకులోనుచేసిందిట. మదనాతురంఉడయి దుష్యంతుడు...తన యందక్కోమలి అనురాగంబుపలక్షించి ఇట్లనియె
ధర్మశాస్త్రజ్ఞుడు, అవిరళ జపహోమ తత్పరుడు, నీతికోవిదుడు అయిన నన్నయ ఈ సందర్భంలో శకుంతలా దుష్యంతుల సమాగమానికి ధర్మమూ, నీతిన్యాయమూ దివ్యప్రేమా మొదలైన ఏ పెద్దపదాలతోన రంగు పూయలేదు. కేవలం శరీరంలోని అలజడికి ఇంద్రియ చాపల్యానికి ఎంత ప్రభావం ఉంటుందో మాత్రమే చెప్పాడు. దుష్యంతుడికి శకుంతల అందంగా కన్పించింది. ఆమె కళ్ళలో తన్ను మెచ్చుకున్న భావమూ గోచిరించింది. అంతే మరింత ముందుకు వెళ్ళాడు.
స్త్రీ జనానికి సహజంగా ఉండే వాంఛ లేవో తెలిసిన దుష్యంతుడు, ఈ నార చీర లేమిటి, ఈ కుటీరం ఏమిటి నీవంటి సుందరికి అంతఃపురాలే తగినవి అని ఆశపెట్టాడు. గాందర్వవివాహం చేసుకుందాం అని అన్నాడు. ఇక్కడ కూడా దుష్యంతుడు నువ్వంటే నాకు ప్రేమ అని అనడు. నీకును నాకును నెమ్మి పరస్పర ప్రేమ కాముడు పెంచుతాడు. ఇక్కడ కాముడికే పెద్ద పీట.
శకుంతల పాపం సాధారణ కన్య. ఒక రాజు వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని సంతోషిస్తుంది.. మా నాన్నగారు ఇంట్లో లేరు వనాలకు వెళ్లారు. యీ క్షణమె యేగిరి కానకు (పండ్లు తేవటానికి) మీరు వచ్చారని తెలిస్తే వెంటనే వచ్చేస్తారు ఒక్క ముహుర్తం కాలం వేచి ఉండండి అంటుంది. మా నాన్న వచ్చి నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తే నీ ఇల్లాలిని అయ్యేందుకు నాకు అభ్యంతరం లేదంటుంది.
కాని దుష్యంతుడికి ముహూర్తకాలం...అంటే నలభై ఎనిమిది నిమిషౄలు ఆగాలని లేదు. అందుకే అమంత్రకము, అతిరహస్యము అయిన గాంధర్వ వివాహం కానిచ్చేద్దాం అంటాడు. పైగా కన్యకుతానే చుట్టం తనకు తానే కర్త అని హక్కులు బోధించి శకుంతలనురెచ్చగొట్టేప్రయత్నం చేస్తాడు. వేదాంతం బోధించి శకుంతలను మంచిదే అని మానసికంగా భావించేలా చేస్తాడు. అతని మనస్సులో ఎన్ని దురూహలున్నాయో ఈ అతిరహస్యమైన వివాహం చేసుకుందాం అనడంలోనే తెలుస్తుంది. నువ్వు మేజర్వి ఆయ్యావు నీకిష్టంవచ్చిన వాడ్ని చేసుకునే హక్కువుంది లా ప్రకారం మన పెళ్లి చెల్లుతుంది అని రెచ్చగొట్టే ఆధునిక యువకునిలాగే దుష్యంతుడు మనకు పొడగట్టుతాడు.
ఇక శకుంతలో ఆశలు కోరికలు ఉన్న అమాయక కన్య. ఎదురుగా దేశాన్నలే రాజు పెళ్లాడమంటున్నాడు. తండ్రి వచ్చే దాకా ఆగనంటున్నాడు. ఒకవేళ తాను ఒప్పుకోకపోతే వెళ్లిపోతాఉ. రాజులకు కన్యలకు కొదవా ? తనలాటి నారచీరలు కట్టే అమ్మాయలను ప్రభువులు చూడటమే గొప్ప. ఇంకా పెళ్ళాడతాననటం ఇంకెంత గొప్పో అనుకుంది.
పైగా స్త్రీ సహజమైన ఇంకొక ఆశ కూడా ఆమెను లొంగదీసుకుంది. ఇతడిని పెళ్లి చేసుకుంటే తనకు పుట్టబోయే బిడ్డ రాజు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగని మాట ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంది నీ ప్రసాదమున నాకు దయించిన నందనునే మహీ గురుతర యేవరాజ్యమునకున్ దయతో అభిషిక్తు చేయుమని వరం కోరుకుంది. అప్పటిరాజు అలాగేనని తన ఊపి పబ్బం గడుపుకున్నాడు. ముచ్చట తీరాక శకుంతల ఊసే మరచిపోయాడు. ఇలాటి స్త్రీ పురుషులు అన్ని కాలాలలోనూ ఉంటూనే ఉంటారు.
పాపం శకుంతల మోసపోయింది. కనీసం మోసపోయానని తెల్సుకునేసరికి ఎదురుగుండా తండ్రి ఎవరిని అడిగే మూడేళ్ళ కొడుకు ! తన తండ్రి ఎంత మహర్షి అయినా కుమార్తెనింట్లో ఉంచుకోదలుచేకోలేదు. భర్త దగ్గరే ఉండమని పంపేశాడు.
|