దానము, ధర్ము శీలము :-
దిక్కులేని వారి దీనత బాపిన
పరుషుడిహము నందె పూజ్యుడగును
పరము నందు భాగ్య మేమనవచ్చును
విశ్వదాభిరామ వినురవేమ !
ఈ ప్రకారంగానే దిక్కులేని రోగికి ఆలనా పాలనా కూడా చూడాలని వేమన ఉద్భోదించాడు - అన్ని దానములకన్న అన్నదానము మేలన్నాడు.
ధర్మమరసి పూని ధర్మరాజాదులు
నిర్మలంపు ప్రౌఢి నిలుపుకొనిరి
ధర్మమే నృపులకు తారక యోగంబు || వి ||
ఇలా ఇల్లాలి ధర్ము ఇల్లాలికి, గృహస్థు ధర్మము గృహస్థుకే చెప్పాడు.
ఇంటియాలు విడిచి యిల జారకాంతల
వెంటదిరుగు వాడు వెఱ్ఱవాడు
పంటచేను విడిచి పరిగె యేరినయట్లు || వి ||
చేనిలో ధాన్యరాశి వదలుకుని రాలిగింజలకై కక్కూర్తి పడినట్టే జారకాంతల వెంట పడడం అన్నాడు వేమన ధర్మాచరణలో దాన, శీలములు ప్రముఖ పాత్ర వహించును.
సత్యము :- సత్యము యొక్క ప్రాముఖ్యమున అంతా ఇంతా అనరాదు. అనృత మాడకయుండుట సత్యమును పాసించుట సత్యస్వరూపుని తెల్సుకొనుట సత్యము జ్ఞానము విడదీయరానట్టివి.
సత్యమమరి యుండ, జ్ఞాన మమరియుండు
జ్ఞాన మమరియుండ సత్యముండు
జ్ఞాన సత్యములిల సమమైన - ద్విజుడగు. || వి ||
సత్యమున్న జ్ఞానముంటుంది.
జ్ఞానమున్న సత్యముంటుంది
జ్ఞానము + సత్యము ఉంటే మనిషి ద్విజుడౌతాడు.
ద్విజుడనగా బ్రహ్మజ్ఞాని.
నిజములాడు నతడు నిర్మలుడైయుండు
నిజములాడు నతడు నీవి పరుడు
నిజము పల్కకున్న నీచజన్ముడె యగు || వి ||
సత్యోపాసన చేసినవాడు ద్విజుడౌతాడు. అట్లాగే నిజము పల్కకున్న నీచ జన్ముడెయగు. అచట ద్విజుడనగానే బ్రాహ్మణుడెట్లుకాడో ఇచట కూడా ద్విజుడనగానే కడజాతి వాడని అర్ధము కాదు నీచమానవుడనియే అర్ధము. అలాగే సత్యవాక్కు వలన, ఘనత, ఐశ్వర్యము, మోక్షము కల్గునని వేమన ప్రవచించినాడు.
శౌచము ( శుద్ధి) :-
ఆత్మ శుద్ధిగా లేకుంటే ఆచారమెందుకు ?
భాండం శుద్ధిగాలేకున్న పిండివంటలెందుకు ?
చిత్తం శుద్ధిగాలేకున్న సహస్రనామాది పూజలెందుకు ?
నీటిని శుభ్రపరచేందుకు చిల్లగిం. (ఇండుప గింజ) ఉపయోగం ఎంతో వుంటుంది. అట్లాగే ఈ మనస్సును మురికినుండి వేరుచేసి స్వచ్ఛంగా చేయుటకు ఉపయోగపడేవాడు గురువు.
గురువు చిల్లగింజ కుంభమీ దేహము
ఆత్మ కలుష పంక మడుగు బట్ట
తెలిసి విరిచెనేని దివ్యామృతము తేరు || వి ||
అన్నమునకు అంటుయై నాత్మకు అంటు యాత్మను పెనుగొన్న అన్నమంటు మలిన వస్త్రముతో మాసిన తలతో జిడ్డు శరీరముతో వచ్చిన అగ్రజన్ముడినైనా పొమ్మంటారు, అని చెప్పాడు వేమన. శౌచము, శుద్ధి అంతఃకరణకెట్టు ముఖ్యములో బాహ్యమునకు కూడ ముఖ్యములే నన్నాడు.
కులము, మతము : -
శైవులు కులమునకు ప్రాధాన్యమీయరు.
వేమన కూడా కులమునకు కాక గుణమునకు ప్రాధాన్యమిచ్చెను అని కొందరి యభిప్రాయము. వేమన మానవాతావాది. అన్ని కులములలోని నైచ్యాన్ని తెగనాడాడు. మాల కులస్థులను దూరంగా వుంచడం సహింపలేక....
మాలవానినెల మరి మరి నిందింప
నొడల రక్తమాంస మొకటి గాదె అన్నాడు.
ఇంతకూ అతనిలో వున్నవాడు మాలవాడేనా ? అన్ని ప్రశ్నించాడు. రామనామ పఠనచే వాల్మీకి...బాపడయ్యె కులము ఘనముకాదు గుణము ఘనంబురా, ఏమతములో దోషము కన్పించినా విమర్శించాడు. శైవులనూ వైష్ణవులనూ ఒకే త్రాసులో తూచాడు. అసలు మతభేదాలెందుకు అన్ని మతములు ఒక్కటే కాదా విష్ణుభక్తులెల్ల వెలిబూది పాలైరి
వాదమేల మత విభేద మేల
తెలియ లింగ ధరులు తిరుమంటి పాలైరి అన్నాడు శివకేశవులనకు భేదంలేదని తెలుసుతూ విష్ణువరయ తల్లి వెలయ రుద్రుడె తండ్రి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు తల్లి గొప్పదా తండ్రి గొప్పదా అని మరో వాదన లేవనెత్తకుందురుగాక !
లింగధారులందు దొంగలు కలరయా...అన్నట్లే
ఎంబెరు మతమందు నెసగ మాంసము దిని
మారుపేరు పెట్టి మధువు త్రాగి మతం పేరిటి
జనులు ఎంత నికృష్టులుగ, పశుతుల్యులుగ మారపోతున్నారా అని వ్యధచెందాడు. రెండు మతముల వారూ ఒకరినొకరు తిట్టుకంటూ తమలో తాము కుమ్ముకుంటూ ఉంటే పిట్లపోరూ పిట్టపోరూ పిల్లి తీర్చినట్లు అసలుకు మోసం రావడం మూఢమతోన్మాదులు గ్రహించలేదే అని వాపోయాడు. ఒకరి నొకరు నిందనొనరజేసి, తురక జాతి చేత ధూళియై పోదురు ఇచట ఒకరి నొకరు నిందచేసుకునే వారు లింగమతస్థులే కానక్కరలేదు. పై నుండి వచ్చువాడు తురకవాడూ కానక్కరలేదు. సర్వేసర్వత్రా ఐకమత్యం లేనందువలన నష్టపోయేది మీరే అని తేజంబొకండే కాని సాటివాని మతాన్ని సహించని మతం ఏ మతం ? షణ్మతములకు దేవుడొక్కడని తెలియ లేరా ?
తన మతము వదలక
తుది నెవ్వరి మతములైన దూషింపకయున్
పదిలుడయి కోర్కి గోరక
ముదమున చరియించువాడె మాన్యుడు వేమా ||
స్వధర్మే నిధనం శ్రేయ ! అన్న ఆర్యోక్తి ఎంతో లలితంగా చెప్పాడు వేమన.
కర్మము కర్తృత్వము :-
జనులు ఏం చెయ్యాలని తలచినా అది చెయ్యలేరు. కర్మమూ దైవమూ కలసి రాకపోతే ఒక పని జరిగిందంటే తమ గొప్పతనాన్ని చాటుకుని చెడు జరిగితే విధిని తిడతారు.
చేటు వచ్చెనని చెడనాడు దైవమ్ము
మేలు వచ్చెనేని మెచ్చుదనను
చేటుమేళ్ళు దలపచేసిన కర్మముల్
రెండూ పురాకృత కర్మముల వల్లనే జరుగును. ప్రారబ్ధమును ఆప ఎవరికీ శక్యముకాదు. మంచి తిథీ, వారం, నక్షత్రం చూసి ముహూర్తం పెట్టి పెండ్లి చేస్తే వధూవరులిద్దరూ యమపురికేగారుట. ఇలాగే శకునములను కూడా నమ్మరాదన్నాడు.
మంచి శకునములని యెంచి పెండిలి యాడ
వారలొకరు లేరు వసుధ లోన
జనుల కర్మములను శకునముల్ నిల్పునా || వి ||
మూఢ నమ్మకములకు వ్యతిరేకి :-
బ్రహ్మజ్ఞానము, ఏకేశ్వరోపాసన :
బ్రహ్మజ్ఞానము నొందుట ఏకేశ్వరోపాసనము, ఈ రెండును విత్తుముందా చెట్టు ముందా అన్న మీ మాంస వలె వుంటుంది. ప్రణవంలో ఈశ్వర దర్శన మందగల్గిన యోగికి బ్రహ్మజ్ఞానము కల్గుటయు పరబ్రహ్మ స్వరూపమును లోకన్ను (కన్ను) తో చూడగల్గిన వ్యక్తికి ఈశ్వర సందర్శనమును ఏక కాలమునే జరుగును.
బ్రహ్మ యొక్కడున్నాడని వెఱ్ఱిజనులు వెతుకుతూ వుంటారు కాని బ్రహ్మ మన్నిటియందు పరిపూర్ణమై యుండు నన్నాడు. ఈ బ్రహ్మమును గురువే చూపింపగల్గుతాడు. ఆ బ్రహ్మానందమున విశ్వమంతయు తానగుతాను విశ్వంబైన తత్త్వమగును. ఇట్టి సత్యమును చెప్పగల్గిన వేమన యోగి, ఋషి, బ్రహ్మర్షి . ప్రణవ మెరుగనోడు - భక్తుడెప్పుడు గాడు. జ్యోతి ఎరుగనోడు యోగి గాడు.
బ్రహ్మ మనగ వేరె పరదేశమున లేదు
బ్రహ్మ మనగ తానె బట్టబయలు
తన్ను దానెరిగిన తానె పో బ్రహ్మంబు || వి ||
సొమ్ము దొరుకు దనుక జ్యోతి యంతియె కాక
సొమ్ము దొరుకు వెనుక జ్యోతి యేల
దేవుడైన వెనుక దేహంబు యది యేల || వి ||
తానే దైవమైన మన వేమన నిర్మల యోగి
|